Monday 19 December 2011

Bhakti Yogam


ఓమ్

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

గీతాంమృతమున

ద్వాదశాధ్యాయము

భక్తియోగము


కర్మయోగులు ముఖ్యులా? కనుగొనగ జ్ఞానయోగులు ముఖ్యులా

వీరిలో యెవరు గొప్ప వివరించి తెలియ చెప్పుము అచ్యుతా! ||1||


నాయందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజియించువారు

సర్వము నేనెయంచు మదినెంచి సంచరించెడు వారును ||2||


నాకు ముఖ్యులు వీరులు ఫల్గునా నన్నాశ్రయించుకతన

వీరికిత్తును భక్తిని వేగమే ముక్తినిత్తును ప్రేమతో ||3||


అవ్యయుని అగ్రాహ్యుని మఱియును అప్రమేయుని గాంచగా

యత్నించు వారు గూడ అర్జునా నన్నె పొందంగగలరు ||4||


ఆ మార్గ మతికష్టము అర్జునా అందరికి సాధ్యపడదు

కష్టములు పడక పార్ధ చిక్కునే కమలేశు పాదభక్తి ||5||


నన్నె గతిగా నెంచుచు నాకన్ని కర్మఫలములు నిచ్చుచు

నా యందు మనసు నుంచి యెప్పుడు నన్ను సేవించువారి ||6||


జన్మ బంధంబు నుండి రక్షింతు సత్వరంబుగ వారిని

సౌఖ్యమును జ్ఞానమిత్తు చక్కగా సర్వంబు నిత్తు నేను ||7||


నా యందు మనసు నుంచి తిరముగా నన్ను భజియింతువేని

నా యందు వసియింతువు నమ్ముము సందియింబిందు లేదు ||8||


నా యందు మనసు నుంచి ఫల్గునా నన్ను జేరగలేనిచో

అభ్యాసయోగంబుచే అర్జునా నన్ను బొందగ వచ్చును ||9||


దానికిని జాలవేని నను గూర్చి ధర్మకార్యముల నెపుడు

గావించుచున్న నీకు గల్గును మోక్షమది నిశ్చయముగ ||10||


అట్లు చేయగలేనిచో అర్జునా నన్నాశ్రయించి నీవు

సర్వ కర్మల జేయుచు చక్కగా ఫలము నాకర్పింపుము ||11||


అభ్యాసమున కన్నను జ్ఞానంబు అన్నివిధముల శ్రేష్ఠము

జ్ఞానయోగము కంటెను ద్యానమ్ము శ్రేష్ఠమై యుండు నెపుడు ||12||


కర్మఫలముల విడుచుట కనుగొనగ ధ్యానమ్ము కన్న మేలు

సర్వోత్తమము అయ్యది శాంతిని శాశ్వతంబుగ గూర్చును ||13||


ద్వేషింపనట్టివాడు భూతముల పోషించు నట్టివాడు

సుఖదుఃఖముల సమముగా మదిలోన జూచుచుండెడి వాడును ||14||


దానంబు జేయువాడు మఱియును ధర్మంబు జేయువాడు

ఓర్పు గల్గిన వాడును నేర్పుతో యోగంబు చేయువాడు ||15||


కారుణ్య హృదయుండును కమలాక్షు సేవజేసెడు వాడును

జ్ఞానంబు గలవాడును మఱియును ధ్యానంబు చేయువాడు ||16||


అహములేనట్టివాడు అర్జునా మమత లేనట్టివాడు

అత్యంత ప్రియుడు నాకు ఆతడు పొందు ముక్తిని నిజముగా ||17||


పరుల కెప్పుడు భయమును ఫల్గునా కల్గింప నట్టివాడు

పరులచేతను భయమును పొందక భధ్రముగ నుండువాడు ||18||


సుఖదుఃఖములు సమముగమదిలోన జూచుచుండెడి వాడును

ద్వేషమదిలేనివాడు దేనిని కోరకుండెడి వాడును ||19||


మానావమానములను మహిలోన సమముగా జూచువాడు

శత్రుమిత్రులనొకటిగా జూచెడు శాంత స్వరూపుండును ||20||


అత్యంతప్రియుడు నాకు అర్జునా అంత్యమున నన్నెబొందు

యీ ధర్మమార్గంబును విడవగారాదు యెవ్వరికైనను ||21||


***


ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంసస్వామి ప్రణీతంబయిన

గీతాంమృతమున

ద్వాదశాధ్యాయము సమాప్తము

ఓం తత్సత్ ఓం

0 Comments:

Related Posts Plugin for WordPress, Blogger...
 

blogger templates | Make Money Online